
వెల్దుర్తి, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర గృహ నిర్మాణాల కార్పొరేషన్ కమిషనర్ గౌతమ్ అన్నారు. శుక్రవారం మండలంలోని ధర్మారం గ్రామాన్ని ఆయన సందర్శించారు. ఈ గ్రామాన్ని పైలెట్ ప్రాజెక్టుగా ప్రభుత్వం ఎంపిక చేయగా గ్రామానికి మంజూరైన నిర్మాణాలు, లబ్ధిదారుల వివరాలు పరిశీలించారు. అనంతరం గ్రామపంచాయతీ ఆవరణలో జరిగిన సదస్సులో ఆయన మాట్లాడారు.
రాష్ట్ర ప్రభుత్వం ఇల్లు లేని నిరుపేదలకు గూడు కల్పించేందుకే రూ.5 లక్షలు ఇంటి నిర్మాణం కోసం మంజూరు చేస్తోందని, లబ్ధిదారులు ప్రభుత్వ నిబంధనల మేరకు 400 చదరపు గజాల్లోనే ఇల్లు నిర్మించుకుంటే ప్రభుత్వం మంజూరు చేసిన డబ్బులు సరిపోతాయన్నారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ నగేశ్, తహసీల్దార్ కృష్ణ, ఎంపీడీవో ఉమాదేవి, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.
ఇందిరమ్మ ఇళ్ల పరిశీలన..
జిన్నారం : జిన్నారం మండలం మాదారంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని హౌసింగ్ ఎండీ గౌతం పరిశీలించారు. పనుల్లో లోటుపాట్లు, నిర్మాణంలో పాటిస్తున్న నాణ్యతలను అడిగి తెలుసుకొని పలు సూచనలు చేశారు.. ఎంపీడీవో అరుణ రెడ్డి, అధికారులు ఉన్నారు.